ఉదయనిధి‌పై చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు సీజేఐకి 262 మంది ప్రముఖుల లేఖ

  • సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఉదయనిధిపై సర్వత్రా ఆగ్రహం
  • తాజాగా సుమోటోగా తీసుకోవాలంటూ సీజేఐకి ప్రముఖుల లేఖ
  • లేఖ రాసిన వారిలో మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు
సనాతన ధర్మంపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తనయుడు, మంత్రి ఉదయనిధి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయన వ్యాఖ్యలపై సొంత I.N.D.I.A. కూటమిలోని నేతలు కూడా అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఉదయనిధిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ 262 మంది ప్రముఖులు భారత సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు.

 మతసామరస్యాన్ని దెబ్బతీస్తూ, మతపరమైన హింసను ప్రేరేపించేలా విద్వేష ప్రసంగం చేసినందున సుమోటోగా తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. ఉదయనిధి స్టాలిన్ ద్వేషపూరిత ప్రసంగం చేయడంతో పాటు ఆ వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడానికి నిరాకరించారని ప్రస్తావించారు. ఉదయనిధి వ్యాఖ్యలు ఆందోళనకరమని, మెజార్టీ జనాభాకు వ్యతిరేకంగా ద్వేషపూరిత ప్రసంగం చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం నిరాకరించి, చట్టబద్ధ పాలనను అపహాస్యం చేసిందన్నారు. అందుకే సుమోటోగా స్వీకరించాలని సుప్రీం కోర్టును కోరుతున్నట్లు తెలిపారు. లేఖ రాసిన వారిలో 14 మంది మాజీ న్యాయమూర్తులు, మాజీ ఉన్నతాధికారులు ఉన్నారు. ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్ఎన్ ధింగ్రా తదితరులు సంతకాలు చేశారు.

udayanidhi stalin
Supreme Court
cji

More Telugu News